
కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనలో రాష్ట్రం అతలాకుతలం
+పేదలను,నిరుద్యోగులను, మహిళలను, రైతులను, తల్లులను వెన్నుపోటు పొడిచిన కూటమి ప్రభుత్వం.
ఏలూరు జిల్లా
నూజివీడు(త్రీలోక్ న్యూస్):
ఏడాది కాలంగా కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనలో రాష్ట్రం కోలుకోలేని విధంగా అతలాకుతలం అయిందని, పేదలకు ఒక్క పథకం కూడా అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం కల్లబొల్లి కబుర్లు చెప్తూ కాలక్షేపం చేస్తోందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నూజివీడు నియోజకవర్గ ఇన్ఛార్జి మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ పిలుపు మేరకు బుధవారం వెన్నుపోటు దినంను నిర్వహించారు. దీనిలో భాగంగా ద్వారకా సెంటర్ వద్ద నుంచి చిన్నగాంధీబొమ్మ సెంటర్, పొట్టి శ్రీరాములు బొమ్మ సెంటర్, పెద్దగాంధీబొమ్మ సెంటర్ మీదుగా శ్రీనివాస సెంటర్ వరకు పాదయాత్రగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస సెంటర్లో ప్రజలనుద్ధేశించి ప్రతాప్ మాట్లాడుతూ వెన్నుపోటుకు ప్రపంచంలో కేరాఫ్ అడ్రస్ ఎవరైనా ఉన్నారంటే అలాంటి ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబేనని దుయ్యబట్టారు. సూపర్ సిక్స్తో పాటు 143హామీలను తుంగలో తొక్కిన ఘనుడు చంద్రబాబని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలన కుట్రలు, కుతంత్రాలు, కక్షలు, అవినీతి, అరచకాలతో సాగిందన్నారు. తల్లికి వందనం అమలు ఎక్కడ, అన్నదాత సుఖీభవ కింద రూ.20వేలు ఏవీ, నిరుద్యోగులకు నెలకు రూ.3వేలు ఎక్కడ, ఉచిత బస్సు అమలు ఏదంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. నిరుద్యోగులకు నెలకు నిరుద్యోగ భృతి రూ.3వేలు ఇస్తానన్నారని, ఇప్పటికే ఈ ఏడాది కాలానికి రూ.36వేలు బాకీ పడిందన్నారు. అలాగే మహిళలకు నెలకు రూ.15లు ఇస్తామని కబర్లు చెప్పారని, ఏడాది కాలం గడిచినందున మహిళలకు ఒక్కొక్కరికి ప్రభుత్వం రూ.18వేలు బాకీ పడిందన్నారు. 50ఏళ్లు నిండిన బీసీలకు, ఎస్సీలకు పింఛన్ ఇస్తామని హామీ ఇచ్చారని, ఏడాది కాలంగా ఎందుకు పింఛన్లు ఇవ్వడం లేదని నిలదీశారు. 60ఏళ్లు నిండిన వారికే ఇంత వరకు ఒక్క కొత్త పింఛన్ కూడా మంజూరు చేయని ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని విమర్శించారు. గ్రామాల్లో మూడు సెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్లు ఎప్పుడు ఇస్తారో చెప్పాలన్నారు. పది నెలల క్రితం పట్టణంలోని పెద్ద చెరువుకు నాలుగు గండ్లు పడితే ఇంత వరకు ఆ గండ్లను పూడ్చలేని అసమర్ధ ప్రభుత్వం రాష్ట్రంలో పాలన చేస్తోందన్నారు. గండ్లు పూడ్చకపోతే త్వరలోనే ప్రజా ఉద్యమం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. అలాగే నూజివీడులో మైలవరం రోడ్డు నుంచి విస్సన్నపేట రోడ్డుకు బైపాస్ రోడ్డు నిర్మాణానికి రూ.25కోట్లు మంజూరై భూసేకరణకు సంబంధించి అవార్డు సైతం పూర్తయిందని, ఈ ప్రభుత్వంలో ఏడాది కాలంలో ఇంత వరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదన్నారు. ఏరియా ఆసుపత్రిలో రూ.25కోట్లతో నూతన భవనం నిర్మించడం జరిగిందని, దీనిలో 300ల బెడ్లు ఏర్పాటు చేసినట్లయితే జిల్లా ఆసపత్రిగా మార్చడానికి వీలవుతుందని, ఎమ్మార్ అప్పారావు కాలనీలో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి భవనంను నిర్మించి పది నెలలు అవుతున్నా ఇంత వరకు అందులో అర్భన్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని మార్చడం లేదన్నారు. ఈ ఏడాది మామిడి పరిస్థితి దారుణంగా తయారైందని, మామిడి రైతులకు ఎకరాకు రూ.50వేలు నష్టపరిహారాన్ని ప్రభుత్వం చెల్లించాలన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం ఆరు నెలల్లో పూర్తిచేస్తామన్నారే గాని ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని విమర్శించారు. ప్రజా ఉద్యమాలు నిర్వహించి ప్రజలను చైతన్యం చేయకుంటే కూటమి ప్రభుత్వం ఒక్క పథకాన్ని కూడా అమలు చేయకుండా నిరంతరం ప్రజలను మోసం చేసే పనిలోనే ఉంటుందని, అందుకే మౌనంగా కూర్చోకుండా ఈ వెన్నుపోటు దినంను నిర్వహిస్తున్నామన్నారు. మున్సిపాలిటీలో కొందరు కౌన్సిలర్లను నా పక్కన కూర్చోబెట్టుకున్నా పార్టీలు మారారని, ఎవరికి ఏ అన్యాయం చేశానో తెలియడం లేదన్నారు. అనంతరం సబ్కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్రగా వెళ్లి కార్యాలయ ఏఓ ఉదయభాస్కర్కు వినతి పత్రం అందజేశారు.
ఏలూరు జిల్లా త్రీలోక్ న్యూస్ రిపోర్టర్
యం.కనకారావు
—— END——